కేరళ లో పూజారులను నంబూద్రి అంటారు. అయితే ఒకానొక రోజున ఒక ఊర్లో ఒక తిండిపోతు నంబూద్రి ఉండేవాడు. ఆ ఊరి పెద్ద, కొడుకు పెళ్లి ఘనంగా జరిపించాడు. అదే ఊర్లో ఉండే మన నంబూద్రికి కూడా ఆహ్వానం వచ్చింది. పట్టు పంచె ధోవతితో మన నంబూద్రి పొట్ట నిమురుకుంటూ పెళ్లి భోజనానికి వెళ్ళాడు.
అనేక రకాల పిండివంటలు, చిత్రాన్నాలు, దోశలు, జిలేబీ, అరటిపండులు, ఇలా ఎన్నో రకాలు వడ్డించారు. చాలా రకాలు ఉండటంతో మనవాడు చాలానే తిన్నాడు.
తినలేక అవస్థపడుతూ అటూ ఇటూ కదులుతూ పొట్టలో ఖాళీ చేసుకుంటున్నాడు. మళ్లీ ఇంకొన్ని జిలేబిలు తిని హమ్మా అని అనుకున్నాడు ఎదో విధంగా లేచి రెండు అడుగులు వేశాడో లేదో అమ్మో... అయ్యో.. అని తెగ బాధపడిపోతున్నాడు. అతని బాధని చూస్తున్న పక్కనే నడుస్తున్న వ్యక్తులు మన నంబూద్రిని చూసి నవ్వుతున్నారు.
అంతలో పక్కనున్న అదే ఊరు ఆయన అంత ఆపసోపాలు పడుతూ నడవకపోతే, నీ నోట్లో వేలు పెట్టి కక్కేయొచ్చుకదా అన్నాడు. అందుకు మన నంబూద్రి వేలు దూరేంత ఖాళీ ఉంటే ఇంకో అరటిపండే తినే వాడిని కదా అన్నాడంట!!
చూసారా పిల్లలు నంబూద్రి కథ చాలా సరదాగా ఉంది కాదు.
No comments:
Post a Comment